కేరళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రతిపక్ష నాయకుడు సతీశన్( V. D. Satheesan) కేరళ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మే 18న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేరళ అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగియనుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపికపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ కొనసాగింది. సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్( K. C. Venugopal), రమేశ్ చెన్నితల( Ramesh Chennithala)లను వెనక్కి నెట్టి వీడీ సతీశన్ తుది ఎంపికగా నిలిచారు.
కేరళ సీఎం ఎంపికలో జరిగిన ఆలస్యం… గతంలో కర్ణాటకలో సీఎం పదవిపై సిద్దరామయ్య) Siddaramaiah),డీకే శివకుమార్( D. K. Shivakumar) మధ్య నెలకొన్న పరిస్థితిని గుర్తు చేసింది. అక్కడ ఇద్దరు నేతల మధ్య కొనసాగిన అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ ఎన్నికల్లో పినరయి విజయన్( Pinarayi Vijayan) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో యూడీఎఫ్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
సతీశన్ ప్రస్థానం
రాజకీయాల్లోకి రాకముందు వీడీ సతీశన్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఎర్నాకులం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన… అనంతరం 2006, 2011, 2016, 2021, 2026 ఎన్నికల్లోనూ గెలిచి తన రాజకీయ బలం చాటుకున్నారు.


