స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్ముల పొదిలో ఉన్న అ్రస్తాలు తీస్తే విపక్షాలు గాలికి కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు జరిగాయి. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సభలో రాష్ట్ర ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మళ్లీ అధికారం తమదేనని.. ప్రస్తుతమున్న సీట్ల కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి, సాగు-తాగు నీరు, వ్యవసాయం సహా వివిధ అంశాలపై ప్రసంగించారు.
CM KCR : సంక్షేమం విషయంలో తగ్గేదే లేదు..!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కొంప ముంచిందని విమర్శించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించిందని అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడితే ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఇవ్వట్లేదని ఆరోపించారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేలు ఇస్తామని.. త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామన్నారు.
బీఆర్ఎస్ ఎప్పటికీ లౌకికవాద పార్టీయేనన్నారు. మజ్లీస్ పార్టీ ఎప్పుడూ తమ మిత్ర పక్షమేనన్న కేసీఆర్.. భవిష్యత్లోనూ ఎంఐఎంను కలుపుకొని పోతామన్నారు. అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను విమర్శించిన బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ఉచిత హామీలు ప్రకటించి కూడా ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. మా అమ్ముల పొదిలో కూడా చాలా అస్త్రాలు ఉన్నాయని.. మేం వాటిని ప్రయోగిస్తే విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయన్నారు.
Latest Articles
- Advertisement -