సుచిరిండియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సర్ సివి రామన్ ఒలంపియాడ్ పేరుతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు గల విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. భారత్ లోని దాదాపు 560 కేంద్రాల నుంచి 75వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ముందు వరుసలో నిలిచిన విద్యార్థులకు యంగ్ జీనియస్ అవార్డులను ఫిబ్రవరి 16న నాంపల్లిలోని లలిత కళా తోరనంలో అందించనున్నట్లు సుచిరిండియా సంస్థ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ వై. కిరణ్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలికి తీసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సుచిరిండియా ఫౌండేషన్ సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షలను గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా నిర్వహిస్తోందన్నారు.
సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షను దేశవ్యాప్తంగా 560 కేంద్రాల్లో నిర్వహించింది. ఈ పరీక్షకు 75వేలకు పైగా విద్యార్థులు హాజరై, తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి గోల్డ్ మెడల్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలు, సర్టిఫికేట్లు అందిస్తామన్నారు. సుచిరిండియా ఫౌండేషన్ తరపున నిర్వహించిన సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షకు హైజరైన విద్యార్థులందరికీ, పరీక్షకు విద్యార్థులను తీసుకొచ్చిన విద్యా సంస్థలకు ఫౌండేషన్ చైర్మన్ లయన్ డాక్టర్ వై. కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించి, గోల్డ్ మెడల్స్ పొందే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.