మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్తారని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అని కొట్టిపారేశారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని చెప్పారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. మెదక్లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్న కోమటిరెడ్డి… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైలులో ఉన్నారని, బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారని కోమటిరెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారని అన్నారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తామని హచ్చరించారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.