అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తొచ్చిందని అన్నారు. గవర్నర్ను గౌరవించాల్సింది పోయి ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారాయన. గొడవలు, బూతులకు వైసీపీ పర్యాయపదంగా మారిందని అన్నారు. వైసీపీని తట్టుకుని చంద్రబాబు నిలబడ్డారంటే .. నిజంగా హ్యట్సఫ్.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు. ” నిన్న వైసీపీ తీరు చూస్తే వివేకా హత్య గుర్తొచ్చింది. ప్రజావేదికను కూల్చిన విధానం గుర్తొచ్చింది. గవర్నర్ గారికి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయన ప్రసంగం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. కూటమి అధికరంలోకి వచ్చిన నాటినుండి వారికి ఇబ్బంది పెట్టోద్దని సిఎం చెప్పారు. అయినా వారి వ్యవహర శైలి మారలేదు. నిన్న సభలో నుండి వైసిపి బయటకు వెళ్లిపోవడంలో మా తప్పులేకపోయినా గవర్నర్ కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా.
గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆడడంతో పెట్టుబడులు రాక క్షీణించింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఈ సవాళ్లను ఎదుర్కొనిప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్ధిక సుస్ధిరత కోల్పోయినా సీఎం చంద్రబాబు దారిలో పెడుతున్నారు. పంచాయితీరాజ్ లో అవినీతికి తావు లేకుండా ఉద్యోగుల బదిలీలు చేశాం. గ్రామ సభలు రికార్డు స్ధాయిలో పల్లె పండుగ రూపంలో నిర్వహించాం.
రూ.4500 కోట్ల వ్యయంతో 30వేల అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించాం. ఆరునెలల కాలంలో కూటమి ప్రభుత్వం 4300 కిలో మీట్లర్ల రోడ్ల నిర్మాణం చేశాం. 22,500 గోకులాల నిర్మాణం చేపట్టాం. 268 మినీగోకులాలను మాత్రమే వైసిపి అయిదేళ్లలో పెట్టింది.
విజన్ 2047కు అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం ఏర్పాటును జలజీవన్ మిషన్ గా ముందుకు తీసుకువెళుతున్నాం. వీసీల నియామకాన్ని మెరిటోరియస్ ఓరియంటెడ్ గా లోకేష్ నియమించారు.. దానికి ఆయన్ను అభినందిస్తున్నాం”..అని పవన్ కళ్యణ్ అన్నారు.
ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వం కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందని అన్నారు. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉంటామని స్పష్టం చేశారు. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందని చెప్పారు. గవర్నర్కి గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.