స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్… రేపు రాజమండ్రి కేంద్రకారాగారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలవనున్నారు. మూడు రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. రేపు చంద్రబాబుతో జనసేనాని ములాఖత్ కానున్నారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
చంద్రబాబు అరెస్టైన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. ఓసారి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు జనసేనానిని అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రకారాగారంలో ములాఖత్కు అనుమతి లభించింది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నేటి సాయంత్రం నాలుగు గంటలకు జైల్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు.