జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , నారా లోకేష్ , బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు , ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నాగబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి అన్నిసీట్లూ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. వైసీపీకి 11మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ఒక్క సీటు కూడా దక్కలేదు.
5 ఎమ్మెల్సీల్లో ఓ టికెట్ జనసేనకు కేటాయించారు. ఆ సీటు నుంచి నాగబాబును బరిలోకి దించుతున్నట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గతంలో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో 3 ఎంపీ సీట్లు ఖాళీ కాగా… వాటిలో ఓ సీటు కావాలని పవన్ అడిగారు. అయితే నాగబాబును రాజ్యసభకు పంపడం కంటే కూడా ఎమ్మెల్సీగా చేసుకుని కేబినెట్ లోకి తీసుకుందామంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందుకు పవన్ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నారు.
నాగబాబు నామినేషన్ పత్రాలపై పది మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వాటిని తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా హాజరయ్యారు. ఎమ్మెల్యేల ఓట్లతో జరిగే ఈ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా విజయం సాధించడం లాంఛనమే కానుంది.