ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమై పోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రాను న్నారు. YCP ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు. ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలు అయిన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్నే స్వయంగా ముద్రగడకు వివరించనున్నారని సమాచారం. ఎన్నికల ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అను చరులు చెబుతున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ.. ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు.. జనసేన, టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమనే ప్రచారం సాగింది.. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, అంతా సైలెంట్ కాగా.. ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్లోకి వెళ్లింది.