తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మెజార్టీ సాధనలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీవీకేకు ఎన్నికల్లో 108 స్థానాలు దక్కగా, డీఎంకే (Dravida Munnetra Kazhagam) 59 స్థానాలు, అన్నాడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి వస్తే మొత్తం బలం 106కి చేరుతోంది. అయితే అది కూడా పూర్తి మెజార్టీకి సరిపోకపోవడంతో మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది.
ఇప్పటికే డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నాడీఎంకే వర్గాలు సంకేతాలు ఇస్తుండగా, అలాంటి ప్రతిపాదనేదీ లేదని డీఎంకే నేతలు చెబుతున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు విజయ్( Vijay) నేతృత్వంలోని టీవీకే సంఖ్యాబలం విషయంలో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పష్టమైన మెజార్టీ నిరూపించాలని రాజ్భవన్ నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనే కొత్త పొత్తుల వార్తలు తెరపైకి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్కు మద్దతుగా కాంగ్రెస్ (Indian National Congress౦ మాత్రమే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వీసీకే( Viduthalai Chiruthaigal Katchi)తో కూడా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే అన్నాడీఎంకే, వామపక్ష పార్టీలు ఇప్పటివరకు టీవీకేతో కలిసి నడవడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
ఈ పరిణామాలన్నింటి మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? విజయ్ మెజార్టీ సాధిస్తారా? లేక కొత్త రాజకీయ కూటమి అవతరిస్తుందా? అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.


