ఈడీ అరెస్ట్ చేయటం అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగ నుంది. ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపట్లో కోర్టు విచారణ చేయనుంది.
కేజ్రీవాల్ను ఐదో రోజు ఈడీ కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, రూ.100 కోట్ల ముడుపులు, సౌత్గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ను ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. చార్జ్షీట్ అంశాలపై కేజ్రీవాల్ వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. కేజ్రీవాల్ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే.. అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈడీ లాకప్ నుంచే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న పరిపాలనకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేశారని ఆప్ నేతలు చెప్పారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొ న్నట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్లతో ఉచిత మందులు, వైద్య పరీక్షకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ను కోరారు. అయితే ఇవాళ్టి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈడీ లాకప్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పారిపాలన సాగించటంపై బీజేపీ మండిపడుతోంది. సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కాగితం, కంప్యూటర్ వంటి వాటిని సమకూర్చలేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ జారీ చేస్తున్న ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. మొదటి పరిపాలన ఆదేశాలు అందుకున్న ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రిని అతిశీని ఈ విషయంపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.