కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ఏకుకు మేకులా తయారవుతున్నారా? పార్టీ లైన్ దాటుతూ వివాదాస్పదం అవుతున్నాడా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్కు చెందిన ఇషా ఫౌండేషన్ ఎప్పటిలాగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో డీకే పాల్గొనడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు తీవ్రంగా మండిపడుతున్నారట.
సద్గురు జగ్గీ వాసుదేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీని, యూపీఏ పాలనను బహిరంగంగానే విమర్శించారు. గత పదేళ్లుగా దేశం ప్రశాంతంగా ఉందని.. గత పాలనలో ఉగ్రదాడులు జరిగేవంటూ నేరుగా యూపీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.అంతే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ఎగతాళి చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా వ్యవహరించే జగ్గీ వాసుదేవ్ వద్దకు డీకే శివకుమార్ వెళ్లడం ఇప్పుడు పార్టీలో తీవ్ర దుమారం రేపుతోందట.
డీకే శివకుమార్ ఇషా ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లడమే కాకుండా.. జగ్గీ వాసుదేవ్కు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు కూడా పెట్టారు. ఈ పోస్టుపై ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ స్పందించారు. డీకే శివకుమార్.. సద్గురు జగ్గీ వాసుదేవ్ కార్యక్రమానికి హాజరుకావడం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని.. ఇది పార్టీకి నష్టం కలిగించే చర్య అని మండిపడ్డారు. కేవలం పీవీ మోహన్ మాత్రమే కాకుండా ఇతర నాయకులు కూడా శివకుమార్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డీకే పార్టీ లైన్ దాటారనే చర్చ కూడా కాంగ్రెస్లో జరుగుతుంది.
తాను డీకేను విమర్శించటం లేదని.. ఆయన ఆలయాలను సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని.. కానీ శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండి.. ఇషా ఫౌండేషన్ కార్యక్రమాలకు హాజరు కావడాన్నే వ్యతిరేకిస్తున్నానంటూ పీవీ మోహన్ చెప్పారు. సద్గురు భావజాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాటికి పూర్తిగా వ్యతిరేకం. పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైతే.. అది కార్యకర్తలకు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించేవారు కాంగ్రెస్లో కొనసాగాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ చాలా సార్లు స్పష్టం చేశారు.. వీటిన్నింటినీ పక్కన పెట్టి డీకే ఆ కార్యక్రమానికి హాజరు కావడం పెద్ద తప్పు అని అన్నారు మోహన్.
రాహుల్ గాంధీ కుటుంబంతో దగ్గర సంబంధాలున్నాయని చెప్పుకునే శివకుమార్.. పుట్టుకతో హిందువునని ఇటీవల వ్యాఖ్యానించారు. మహాకుంభ మేళాను సందర్శించి అక్కడి ఏర్పాట్లను కూడా ప్రశంసించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన అనంతరం మాట్లాడుతూ నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరారు.
ఒక వైపు రాహుల్ కుంభమేళాకు ఎందుకు హాజరు కాలేదంటూ బీజేపీ, శివసేన నాయకులు విమర్శలు చేస్తుంటే.. డీకే శివకుమార్ మాత్రం కుంభమేళాకు హాజరై.. అక్కడి ఏర్పాట్లను ప్రశంసించడం కాంగ్రెస్లో కాక పుట్టించింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతున్న నేపథ్యంలో శివకుమార్ తన హిందుత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తుంటే.. డీకే మాత్రం పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు.
డీకే శివకుమార్ వ్యవహార శైలిపై పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే సీరియస్గా ఉందట. డీకే వ్యాఖ్యలు, వైఖరిపై సమాధానం చెప్పాలని కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో డీకే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.