స్వతంత్ర, వెబ్ డెస్క్: మెర్సర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం భారత్లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్కి చోటు లభించింది. దేశీయంగా చూస్తే.. ఈ జాబితా అగ్రస్థానంలో ముంబై నిల్వగా.. ఆ తరువాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్ కత్తా, పూణే ఉన్నాయి. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహరం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితా రూపొందించారు.
ఐదు ఖండాల్లోని 227నగరాల్లో జరిపే ఈ సర్వేలో.. ముంబయికి 147వ స్థానం, ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా, పాకిస్థాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. ఆసియాలో అత్యంత ఖరీదైన అగ్రగామి 35 నగరాల్లో ముంబయి, దిల్లీ నిలిచాయి. ఆసియా నగరాల్లో ముంబయి స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27కు చేరింది.
ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్, కోల్కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగ్లో భారత నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి ప్రాంతాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి.