మైనారిటీల అభివృద్ధి, హక్కులు, మనోభావాలు కాపాడటం, ఇతర ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీల్లో అత్యంత ముఖ్యమైనది ఎంఐఎం. హైదరాబాద్లోని పాతబస్తీ దారుల్షిఫా కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న మజ్లిస్ పార్టీకి.. ఓల్డ్ సిటీలో తిరుగులేదనే చెప్పాలి.
సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎంఐఎంను మరింత తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు అసదుద్దీన్ ఒవైసీ. కేవలం పాతబస్తీలోనే కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని చోట్ల బరిలో నిలిపి విజయపతాకం ఎగురవేశారు. అక్కడకూ పార్టీని విస్తరించారు.
నియోజకవర్గంలో ఇతర ఓటర్ల సంగతి ఎలా ఉన్నా..తమ పార్టీ తరఫున కేవలం మైనారిటీ అభ్యర్థుల్నే రంగంలోకి దింపుతూ వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న చరిత్ర ఎంఐఎంది. మైనారిటీల సమస్యలతోపాటు నియోజకవర్గంలోని ఇతరుల సమస్యల్ని దారుల్షిఫా కేంద్రంగా అక్కడికక్కడ వీళ్లు పరిష్కరిస్తారని పేరు సైతం సంపాదించారు మజ్లిస్ నేతలు. అందుకే అభ్యర్థిగా ఎవరున్నా ఎంఐఎంకు తిరుగులేదన్న వాదన బలంగా విన్పిస్తుంది. అయితే ఆనవాయితీకి భిన్నంగా రాజేంద్రనగర్లో తమ పార్టీ తరఫున మొదటిసారి ఓ హిందూ అభ్యర్థికి చోటిచ్చారు అసదుద్దీన్ ఒవైసీ. కార్వాన్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న స్వామి యాదవ్ను ఎంఐఎం అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ నేతలు. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
అయితే.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ఇక్కడ హిందూ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ నిలిపిందన్న ప్రచారం సాగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 5 లక్షలా 70 వేల ఓటర్లున్నారు. ఇందులో మైనారిటీల సంఖ్య కూడా తక్కువేం కాదు. పాతబస్తీకి పొరుగునే ఉండడంతో ఈ నియోజకవర్గంలో గెలిచి పార్టీని మరింత విస్తరించాలన్న ఆలోచన ఒవైసీ చేసినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్లు ఎలాగూ తమకే దక్కుతాయన్న దీమా ఎలాగూ ఉంది. అయితే.. మైనారిటీయేతర ప్రజల ఓట్లను గెలుచుకునే వ్యూహంలో భాగంగానే మొదటిసారిగా హిందూ అభ్యర్థికి టికెట్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి..రాజేంద్రనగర్లో మజ్లిస్ వ్యూహం పారుతుందా ? లేక ఇతర పార్టీలు పాగా వేస్తాయా అన్నది చూడాలి.