స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేల అయినా సీఎం కేసీఆర్కు రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించారని.. ఆ విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి కావాలన్నారు. రుణమాఫీ లేట్ కావడం వల్ల వడ్డీ పెరిగిందని… రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోతుందని తెలిపారు. అన్ని సబ్సీడీలు ఎత్తేసి రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఆగష్టు వచ్చినా 6 ఎకరాల పైబడిన వారికి రైతు బంధు రాలేదన్నారు. వాయిదా పద్ధతిలో కాకుండా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని దాటవేసే అవకాశం లేకపోలేదన్నారు.
రైతుల నమ్మకాన్ని కేసీఆర్ కోల్పోయారన్నారు. కేసీఆర్ బాండ్లను, చెక్కులను ఎవరూ నమ్మరని తెలిపారు. దళితబంధు అందరికీ ఇవ్వకుండా దళితులను కేసీఆర్ మోసం చేసారని మండిపడ్డారు. బీసీబంధుకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అలాగే ముస్లింబంధు ఏమైందని నిలదీశారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. కేసీఆర్ ప్రకటనలు చేయడం కాదు.. ఆచరణ కావాలని హితవుపలికారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా కలుపుతారని కేసీఆర్ అన్నది వాస్తవం కాదా అని అడిగారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ పధకం కావాలన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.