హరితహారం చెట్లు మోడుబారుతున్నాయి. రాజుల పైసలు రాళ్లపాలు అన్నట్టు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాటిన చెట్లు గొడ్డలిపోటుకు గురువుతున్నాయి. విద్యుత్ ప్రమాదం ఉండటంతో నీడనిచ్చే చెట్లను నరకాల్సిన పరిస్థితి నెలకొంది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అటవీవిస్తీర్ణమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కోట్ల మొక్కలు నాటేందుకు కోట్ల రూపాయలను వెచ్చింది. అయితే మొక్క పెరిగి పెద్దదయ్యేసరికి విద్యుత్ తీగలకు అడ్డం అంటూ ఆ చెట్టుపై గొడ్డలి వేటు వేయాల్సి వస్తోంది. దీంతో మొక్కలు నాటడం ఎందుకు అవి చెట్లయ్యాక నరకడం ఎందుకు అన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అధికారులు ఆ మాత్రం బుర్ర వాడలేరా..? ముందు చూపుతో ఆలోచించరా అని మండిపడుతు న్నారు జనం.
హరితహారం కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీని కూడా ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, పురపాలక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించి నర్సరీలను ఏర్పాటు చేసి.. అవసరమైన వివిధ రకాల మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. అయితే మొక్కలు నాటడంలో చూపిన శ్రద్ధ భవిష్యత్తులో నాటిన మొక్కలతో ఏర్పడే నష్టాల గురించి ఆలోచించలేదు అధికారులు. దీంతో నీడనిచ్చేంత ఎత్తుకు ఎదిగిన చెట్లను మోడుగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 లక్షల 58 వేల మొక్కలు నాటి మొక్కల చుట్టూ రక్షణ ఏర్పాటుకు 4 కోట్ల 65 లక్షల రూపాయలను ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఈ మొక్కలను ఇష్టానుసారం గా కరెంట్ స్తంబాల వద్ద, విద్యుత్ తీగల కింద నాటడంతో ఇపుడవి వేపుగా పెరిగి వైర్లకు తగడలడం తో కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చెట్ల వల్ల ఈదురుగాలుల సమయంలో తీగల మధ్య రాపిడితో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యుత్తు సంస్థ అధికారులు కొమ్మలను చెట్లను నరికి వేశారు. దీంతో మొక్కలు నాటే సమయంలో ముందు చూపుగా విద్యుత్ తీగలకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాల్సింది అని రోడ్లుకు 50 ఫీట్ల లోపల నాటితే చెట్లను నరికే పరిస్థితి ఉండేది కాదని, అలా చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారని మండిపడుతున్నారు జిల్లా వాసులు.