మొన్న వాళ్లు.. ఇప్పుడు వీళ్లు..! అవును.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మేడిగడ్డ వెళ్లిరాగా.. ఇప్పుడు మేము సైతం అంటోంది బీఆర్ఎస్. హస్తం పార్టీ కాళేశ్వరం విషయంలో దుష్పచారం చేస్తోందని ఆరోపించిన గులాబీ పార్టీ నేతలు.. మార్చి ఒకటి నుంచి ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. మొత్తం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని చెబుతున్నారు.
చలో మేడిగడ్డ అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజా ప్రతినిధులు అంతా కలుపుకొని సుమారు 150 నుంచి 200 మంది వరకు వెళ్లనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కాళేశ్వరం వెళ్లనున్నారు.
మేడిగడ్డలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే మూడు మాత్రమే కుంగిపోయాయని అన్నారు కేటీఆర్. అయితే.. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాత్రం బ్యారేజీయే కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలు ప్రాజెక్టులు, డ్యాముల విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు కేటీఆర్. కాఫర్ డ్యామ్ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చన్న ఆయన.. సీఎం తీరు చూస్తే కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తున్నట్లుగా కన్పిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదన్న కేటీఆర్.. 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజ్లు, 210 కిలోమీటర్ల సొరంగాలు అని వెల్లడించారు. హస్తం పార్టీ గతంలో చేపట్టింది జలయజ్ఞం కాదని.. ధనయజ్ఞమని ఆరోపించారు కేటీఆర్.
ఇటీవలె.. కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లి వచ్చారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పరీక్షించారు. ఈ సందర్బంగా నాటి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విరుచుకుపడ్డారు. అయితే… ఆ రోజు జరిగిన పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. అదే సమయంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో రేవంత్ సర్కారు వైఖరి ఎండగడుతూ నల్గొండలో గులాబీ పార్టీ భారీ సభ నిర్వహించింది. సర్కారు తీరుపై దుమ్మెత్తి పోసింది. అయితే.. మేడిగడ్డ విషయంలో రేవంత్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఇప్పుడు మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది.
కేవలం ఇదే కాదు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వచ్చే నెల 10న కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని డిసైడైంది గులాబీ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.