దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ CBSE( Central Board of Secondary Education) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP) అమలులో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
CBSE తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించింది.
అయితే పదో తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష నిర్వహించబోమని CBSE వెల్లడించింది. విద్యార్థులపై అదనపు ఒత్తిడి లేకుండా భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
జులై 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న CBSE అనుబంధ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
భారతీయ భాషల ప్రాధాన్యతను పెంచడం, విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చినట్లు CBSE పేర్కొంది.


