ఎండలకు తల్లడిల్లుతున్న జనాలు శీతల సాధనాలవైపు దృష్టి సారిస్తున్నారు. పగలు ఎండల మోత, రాత్రి ఉక్కబోత, ఫ్యాన్లున్నా వేడిగాలి..దీంతో సాధారణ ప్రజలు కూలర్ల కోసం క్యూ కడుతున్నారు. అయితే, కూలర్ల ధరలు కాలరెగరేస్తుం టే..కొనుగోలుదారుల కళ్లుతేలేస్తున్నారు. ఓ వైపు ఎండలు అధికం అవుతుంటే, మరోవైపు కూలర్ల ధరలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భయం కల్గిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ వడదెబ్బకు గురిచేస్తాయో…అని జనాలు బెంబేలెత్తుతున్నారు. ఎండల మోత, ఉక్కబోతతో ప్రజలు శీతల సాధనాలవైపు దృష్టి సారిస్తున్నారు. ఫ్యాన్లున్నా వేడిగాలి రావడంతో.. వేడిగాలుల ఉపశమనానికి జనం కూలర్లవైపు చూస్తున్నారు. అయితే, ఎండలతో పోటీ పడుతూ కూలర్ల ధరలు మండిపోతున్నాయి. ఎండల నుంచి విముక్తి కోసం ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు దృష్టిసారిస్తున్నారు. ధనిక వర్గాల ప్రజలకు ఏసీలు.. అంతకు మించిన గొప్ప శీతల పరికరాలు అందుబాటులో ఉండవచ్చు. ఇళ్లల్లో, కార్లలో, కారిడార్లలో, కార్యాలయాల్లో ఎక్కడైనా అధికాదాయ ప్రజలకు హాయిగొలిపే వాతావరణమే ఉంటుంది. మరి పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల మాటో…? అంటే…మోయలేని ఆర్థిక భారం మోయాలని, కొండెక్కి కూర్చున్న ధరాభారాన్ని భరించాలని బడా బడా వర్గాలు ఉచిత సలహాలు ఇస్తాయి.
ఏ సమస్య వచ్చినా ప్రధానంగా పేదలపైనే పడుతుంది. ఇక వాతావరణ పరిస్థితులు సైతం పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలపై మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే ఈ వర్గాల ప్రజలకు అకారణ కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇరుకు గదుల్లో, గాలి వెలుతురు సౌలభ్యం లేని రేకు షెడ్లలో, పూరి పాకల్లో, డబ్బా ఇండ్లలో ఎందరో పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు. పొద్దంతా కాయకష్టం చేసి సాయంత్రానికి ఇంటికి చేరే పేద వర్గాల ప్రజలు సాధారణంగా చేతి ఫంకాలు, గాలి ఫంకాలమీదే ఆధార పడతారు. రెక్కల ముక్కలతో శారీరక శ్రమ చేసి ఇంటికి చేరాక విసనకర్రలతో విసురుకోలేక..ఆర్థికస్థోమత లేకపోయినా..ఫ్యాన్లు కొనుగోలు చేసి కాలక్షేపం చేస్తున్నారు. అయితే, పగటి పూట సూర్య ప్రతాపంతోపాటు రాత్రి ఉక్కబోత, చెమటలు, వేడిమి వదలడం లేదు. దీంతో, కూలర్లే శరణం అని భావించిన పేద ప్రజలు.. కూలర్ల షాపులకు వెళుతున్నారు. కూలర్ల కొనుగోలుతో మరికొంత ఆర్థికభారం మోయాల్సి వస్తుందని భావించినా, రాత్రి వేళ వేడిగాలులు భరించ లేక కూలర్ల షాపులవైపు అడుగులు వేస్తున్నారు.
ఇరుకు ఇండ్లలో కూలర్లు ఆక్రమించే స్థలం ఎక్కువే. కూలర్లతో వచ్చే కరెంటు భారమే. అయినా, ఎర్రని ఎండలో పొద్దంతా పనిచేసి, రాత్రయినా కాస్త ప్రశాంతంగా నిద్రించడానికి, పేద వర్గాల ప్రజలు కూలర్ల కొనుగోలు కోసం వెళుతుంటే, అక్కడి కూలర్ ధరలు కళుబైర్లు కమ్మేలా చేస్తున్నాయి. కూలర్లకు డిమాండ్ పెరగడంతో, దుకాణదారులు ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి, సప్లై తక్కువగా ఉందని కహానీలు చెబుతున్నారు. ధరలు అమాతం పెంచేసి, కొంటే కొనండి, లేకపోతే మానండి అని నిష్కర్షగా చెప్పేస్తు న్నారు. కేవలం ఎండాకాలంలో వినియోగించి, పక్కన పెట్టేసే సీజనల్ కూలర్లకు ఇంత అధిక ధరా.. అని కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ వేడిమి భరించలేక, నిద్రకు నోచుకోక.. అష్ట కష్టాలు పడుతూ చివరకు అధిక ధరలు చెల్లించి పేదవర్గాల ప్రజలు కూలర్లు కొంటు న్నారు. ఇంత సొమ్ము పెట్టి కొన్న కూలర్లు రెండు మూడేళ్ల పాటైనా ఉంటాయా అంటే కచ్చితంగా ఉండ వనే సమాధానం వస్తోంది. మంచి బ్రాండెడ్ కంపెని కూలర్ కొందామని అనుకుంటే, ఆ కూలర్ల ధరలు చూస్తే ప్రాణాలే పోయేలా ఉన్నాయి. దీంతో చేసేది లేక.. చీప్ గా వచ్చే లోకల్ మేడ్ కూలర్లను కొనుగోలు చేసి సామాన్య జనాలు రోజులు గడుపుతున్నారు.