కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న సామెతకు నిలువుటద్దంగా నిలుస్తోంది నిర్మల. పేదరికం, కష్టాల కన్నీళ్లు, అన్నింటికీ మించి కట్టుబాట్లను ఎదురించి చదువుల తల్లి సరస్వతి ముద్దు బిడ్డ అనిపిం చుకుంది నిర్మల. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ స్టూడెంట్గా ప్రశంసలు అందుకుంటోంది.
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన నిర్మల. తాను నిరుపేద అయినా చదువులో చదువు లరాణిగా ఖ్యాతిని గడించింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చురుకైన అమ్మాయి. అందుకే తన కాళ్లపై తాను నిలబడాలన్న, నలుగురిలో గర్వంగా బతకా లన్నా చదువొక్కటే గొప్ప మార్గమని భావించింది. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువీడని విక్ర మార్కుడిలా తన లక్ష్యం చదువేనని, అది కూడా టాప్లో ఉండాలని తపించింది. చివరికి ఆ గమ్యాన్ని చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆలూరు కేజీవీబీలో ఇంటర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు సాధించింది. బైపీసీలో మొత్తం 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచింది.
ఆడబిడ్డ ఎంత తెలివైనదైనా ఇప్పటికీ వెనక్కి లాగేవారే ఎక్కువ. ముఖ్యంగా సమాజంలోని కట్టుబాట్ల కారణంగా తన కుటుంబమే ఇందుకు కంకణం కట్టుకుంది. పెళ్లి చేస్తే ఓ పనైపోతుంది. భారం దిగిపో తుంది అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటి అనుభవమే నిర్మలకు కూడా ఎదురైంది. అయినా దేనికి తలొగ్గలేదు. కష్టాల కన్నీళ్లను దాటుకుని, పేదరికాన్ని జయించి, ముఖ్యంగా బాల్య వివాహాన్ని ఎదిరించి చదువులో తన సత్తా చాటింది. నిర్మలది నిరుపేద కుటుంబం కావడంతో ఆమె చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. నలుగురు అక్కాచెల్లెళ్లలో నిర్మల నాల్గవ అమ్మాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అయితే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. ఆ తర్వాత నిర్మలకు కూడా పెళ్లి చేసి తమ బాధ్యతను, భారాన్ని దించుకోవాలను కున్నారు. కానీ, నిర్మలకు మాత్రం చదవాలని కోరిక. గతేడాది ఎంతో కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలో 600 మార్కులకు గాను 537 మార్కులు సాధించింది. దీంతో ఆమెను స్కూల్ టీచర్స్, తోటి విద్యార్థులు అంతా అభినందిం చారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఆమె సాధించిన మార్కులు అంతగా ఆనందాన్ని ఇవ్వలేదు. ఏది ఏమైనా పెళ్లి చేసి పంపడమే ముఖ్యమనుకున్నారు. ఈ మార్కులు తమ బిడ్డ పెళ్లికి అడ్డంకిగా మారతా యని భావించారు.
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నిర్మలను ఇంటర్మీడియట్ చదివించేందుకు తల్లి దండ్రులు సాకులు వెతికారు.పెద్ద చదువులు వద్దని, ఇక్కడితో చదువు మానేయాలని నిర్మలను ఒప్పించే ప్రయత్నం చేశారు. దగ్గర్లో ఇంటర్మీడియట్ కాలేజీ లేదని, చదువు కొనసాగించడం సాధ్యం కాదని సూచించారు. తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. పెళ్లి వయసు కాకపోయినా ఆమెకు బాల్య వివాహం జరిపించి, తమ బాధ్యత దించుకుని ఇంకో ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే చదువుకోవాలన్న నిర్మల ధైర్యంగా ముందడుగు వేసింది. తన బాల్య వివాహం గురించి స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. తాను చదువుకోవాలన్న కోరికను ఎమ్మెల్యే ముందు ఉంచింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్కు సమాచారం అందించడంతో బాలిక తల్లిదం డ్రులకు నచ్చజెప్పారు. వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో నిర్మల తల్లిదండ్రులు అందుకు ఒప్పకోవడంతో ఆలూరులోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం లో ఇంటర్మీడియట్ బైపిసిలో చేరింది నిర్మల. ఎన్నో అడ్డంకులను దాటుకుని చదువుకునే అవకాశం రావడంతో మరింత శ్రద్ధతో కష్టపడి చదివి ఇంటర్ ఫలితాల్లో స్టేట్లోనే టాపర్గా నిలిచింది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమంటోంది నిర్మల. తనలా ఎందరో అమ్మాయిల తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నారని, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి వస్తోందని, అందుకే పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టి బాల్య వివాహాలను అరికడతానని చెబుతోంది నిర్మల. అమ్మాయిలు తమ కలలు నిజం చేసుకునేందుకు సహకరిస్తానంటోంది.