సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో భూముల వ్యవహారంపై రెవెన్యూ అధికారుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిన చేస్తున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్పూర్ గ్రామాల పరిధిలోని 325 సర్వే నంబర్లో ఉన్న భూములపై ఫోకస్ చేశారు. ఈ సర్వే నంబర్లో సుమారు 388 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఎర్రవల్లి, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలనకు దిగింది. గురువారం తొలిరోజు రెవెన్యూ అధికారులు సుమారు రెండు గంటల పాటు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. అంతకుముందు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో పాత రెవెన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలించారు. ఎర్రవల్లి, వెంకటాపూర్, పరిసర గ్రామాల్లోని వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి ఎంత? పట్టా లేదా అసైన్డ్ భూమి ఎంత? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి పేరుపై రికార్డుల్లో నమోదై ఉంది? అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు.
శుక్రవారం సర్వేలో శాటిలైట్ మ్యాప్లు, గూగుల్ ఎర్త్ పాత చిత్రాలను పరిశీలించారు. పాత శాటిలైట్ చిత్రాల్లో భూముల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? సాగు విస్తీర్ణం, హద్దులు, నిర్మాణాలు లేదా ఇతర మార్పులు ఏమైనా జరిగాయా? అనే అంశాలను కాలక్రమానుసారం పోల్చి చూస్తున్నారు. భూములపై ఉన్న పాత రికార్డులను, ప్రస్తుత భౌగోళిక పరిస్థితులను సరిపోల్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.


