ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం మల్కం చెరువు వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని డీజీపీ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.


