అక్కినేని నాగచైతన్య నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇటీవలే ఈ సీజన్ 2 కి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ఈ సీజన్కు నాగచైతన్య స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రకటించారు. అసలు ఎందుకు నిర్మాత అయ్యారనే విషయం కూడా బయటపెట్టారు చైతూ. ఇంతకీ ఏం చెప్పారంటే.. కేవలం నటన మాత్రమే కాదు.. ఇంకా ఏదో చేయాలి అనిపించినప్పుడు నిర్మాత అయితే.. ప్రాజెక్ట్ ను మరింతగా ఓన్ చేసుకుని ప్రతిదీ తెలుసుకోవచ్చు అనిపించిందని.. అందుకే నిర్మాతగా మారానని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు దూత సీజన్ 2 నుంచి ఒక సరికొత్త క్రేజీ అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్లోకి తాజాగా సీనియర్ నటి భూమికా చావ్లా ఈ సిరీస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సరికొత్త సీజన్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి సీజన్ ఆసక్తికరమైన సస్పెన్స్ నోట్తో ముగియడంతో.. సీజన్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో భూమిక ఎంట్రీ ఇవ్వడం కథకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఆమె పాత్ర కథను మలుపు తిప్పే ఒక కీలకమైన క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇది కూడా మొదటి సీజన్ లాగే విలక్షణమైన సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్తో సాగనుందని సమాచారం.
ఇక చైతూ 25వ సినిమా విషయానికి వస్తే.. కొరటాల శివ, శేఖర్ కమ్ముల, బుచ్చిబాబు.. ఇలా కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే బెదురులంక డైరెక్టర్ క్లాక్స్ పేరు కూడా వినిపించింది. చైతూ మాత్రం 25వ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే.. ముందు 24వ సినిమా వృషకర్మ రిలీజ్ చేసి.. ఆతర్వాత 25వ సినిమాని అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. వృషకర్మ డిసెంబర్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని.. 25వ సినిమాని కూడా అప్పుడే ప్రకటిస్తారని టాక్.


