రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్హౌస్ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.
పోలీసుల సమాచారం ప్రకారం, మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలుగా గుర్తించారు. ఇటీవల తాండూరులో మిస్సింగ్ అయిన ఈ ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలోని ఓ ఫామ్హౌస్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుల వ్యవహారంలో తలెత్తిన వివాదాలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఘటనకు సంబంధించి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం.


