ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ఆరు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చేరుకున్నారు. అబుధాబికి చేరుకున్న ప్రధాని మోదీ విమానానికి యూఏఈ ఎమిరేట్స్ అధికారులు ఎఫ్-16 యుద్ధ విమానాలతో ప్రత్యేక భద్రతా ఎస్కార్ట్ కల్పించారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ యూఏఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భారత్-యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి.
దుబాయ్లో ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్( Mohamed bin Zayed Al Nahyan)తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటన సందర్భంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG), వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందాలు భారత్-యూఏఈ మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తాయని భావిస్తున్నారు.
గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ భారత్కు అత్యంత కీలక వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. గత 25 ఏళ్లలో యూఏఈ భారత్కు ఏడో అతిపెద్ద పెట్టుబడి వనరుగా నిలిచింది. అలాగే అక్కడ 45 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు.
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో కూడా యూఏఈ భారత్కు విశ్వసనీయ ఇంధన భాగస్వామిగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాల ద్వారా భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇక యూఏఈ పర్యటన అనంతరం ప్రధాని మోదీ యూరప్ పర్యటన కొనసాగనుంది. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్( Ulf Kristersson)తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వండర్ లెయన్( Ursula von der Leyen)తో కూడా సమావేశం కానున్నారు.
ఇటలీ పర్యటనలో అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లా( Sergio Mattarella)తో పాటు ప్రధాని జార్జియా మెలోనీ( Giorgia Meloni)తో మోదీ భేటీ కానున్నారు.


