ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా… అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) బాధితులకు 24 గంటల్లో ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రయాగ్రాజ్లో అత్యధిక మరణాలు
ఈ ప్రకృతి విపత్తులో ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 18 మంది, మిర్జాపూర్లో 15 మంది, ఫతేపూర్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉన్నావ్, బదాయున్ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ప్రతాప్గఢ్, బరేలీలో నలుగురు చొప్పున మరణించారు. సీతాపూర్, రాయ్బరేలీ, చందౌలిలో ఇద్దరు చొప్పున మృతి చెందగా… కాన్పూర్ దేహాత్, హర్దోయి, సంభల్ జిల్లాల్లో కూడా ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కౌశాంబి, షాజహాన్పూర్, సోన్భద్ర, లఖింపూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా మారిన వాతావరణం
నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు, భారీ దుమ్ము రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కమ్మేశాయి. బలమైన ఈదురుగాలులతో హోర్డింగ్స్, టిన్ షెడ్లు ఎగిరిపోగా… భారీ చెట్లు నేలకూలాయి.
ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్లు, ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది. అనేక రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు చెట్ల కింద ధ్వంసమయ్యాయి.
ఇళ్లపై చెట్లు, గోడలు కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక బృందాలు చేతులతోనే మట్టిని తొలగిస్తూ బాధితులను రక్షించేందుకు ప్రయత్నించాయి.
బరేలీలో భయానక ఘటన
బరేలీలో బలమైన గాలులకు ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా… చేతులు, కాళ్లు విరిగినట్లు సమాచారం.


