నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. కేంద్రానికి చెందిన అధికారి జగన్నాథ్ కుమార్ మాట్లాడుతూ.. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా మారి, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు.
ఇక సోమవారం కోస్తా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా మారే అవకాశముండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో అత్యధికంగా 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


