దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అభివృద్ధి కోసం అంతా కలిసి వస్తున్నారని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో రూ.110 కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొడంగల్ బిడ్డ తెలంగాణ సీఎంగా ఉన్నారని.. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని అన్నారు. అయినా ఇంకా సమస్యలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. కృష్ణానదీ జలాలు కొడంగల్ భూములను ముద్దాడాలని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కొరత లేదని.. వేగంగా పనులు జరిగేలా మంత్రి శ్రీహరి పర్యవేక్షించాలని సూచించారు. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా..త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. కొడంగల్ను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని తెలిపారు. కొడంగల్లో రాజకీయాలు పక్కనపెట్టాలని.. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.


