34.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

పాఠశాల విద్యలోకి ఇంటర్ బోర్డు విలీనం .. త్వరలో ఆర్డినెన్స్‌

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థను రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 1971 ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేసి, 1982 స్కూల్ ఎడ్యుకేషన్ చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మార్పుల అమలుకు అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ముందుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం వర్షాకాల సమావేశాల్లో చట్టసవరణలు ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు కలిసి ఇంటర్ బోర్డు చట్టం, సిబ్బంది నిర్మాణం, సేవా నియమావళి తదితర అంశాలను అధ్యయనం చేస్తున్నారు.

ఈ నిర్ణయానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ప్రధాన కారణంగా నిలిచింది. కమిషన్ “నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థ” ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానానికి బదులుగా సమగ్ర పాఠశాల విద్యా వ్యవస్థను తీసుకురావాలని సిఫార్సు చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే స్కూల్ నుంచి హయ్యర్ సెకండరీ వరకు ఒకే బోర్డు పరిధిలో నడుస్తున్నాయని, తెలంగాణ కూడా అదే దిశగా అడుగులు వేయాలని కమిషన్ పేర్కొంది.

ప్రభుత్వం ఈ నిర్ణయానికి పలు కారణాలను చూపుతోంది.

ఇంటర్మీడియట్ దశలో విద్యార్థుల డ్రాప్‌ఔట్లను తగ్గించడం
కేంద్ర ప్రభుత్వ నిధులను మరింతగా పొందడం
పరిపాలనా వ్యయాలను తగ్గించడం
పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఏకీకృత విధానం తీసుకురావడం
NEP-2020 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థను మార్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తోంది.

ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. మొదట ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, తర్వాత దానిని ఉపసంహరించుకుంది. దీనికి విద్యా సంస్కరణలే కారణమని అధికారులు సంకేతాలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, జూనియర్ కళాశాలలు తీవ్ర అయోమయంలో పడ్డాయి.

అయితే ఈ ప్రతిపాదనపై వ్యతిరేక స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘాలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంటర్మీడియట్ ప్రత్యేక వ్యవస్థ వల్లే IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సమర్థంగా సిద్ధమవుతున్నారని వారు అంటున్నారు. స్కూల్ వ్యవస్థలో విలీనం చేస్తే ఆ ఫోకస్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గ్రామీణ పాఠశాలల్లో అవసరమైన ల్యాబ్స్, అదనపు తరగతి గదులు, పీజీ స్థాయి అధ్యాపకులు లేరని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఈ మార్పు విజయవంతం కావాలంటే భారీ స్థాయిలో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది నియామకాలు అవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 1971 నుంచి ప్రత్యేకంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుగా మారే అవకాశముంది

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్