తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో తొలి ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. అలాగే తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్ ను కలిశారు. ఎజిలిటీ సంస్థ ప్రపంచంలో పేరొందిన లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో ఆయనతో పంచుకున్నారు.