విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశానికి మద్దతు ఇచ్చింది.
విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలా సార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలోని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే .అన్నీ ఇస్తాం కానీ, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం.
విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంపాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీ యాలు నడిచాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడానికి సాయపడ్డ ప్రధాన అంశం ఇదే. తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని తాము మాత్రమే చేయగలమని ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఏకం చేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డి కొంత మేర కసరత్తు చేశారు. వాస్తవానికి ఎన్డీయే కూటమిలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షం కాదు. అయినప్పటికీ ఈ ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినా, ముందుగా బలపరచింది జగన్ పార్టీనే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశానికి నరేంద్ర మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అందరూ భావించారు. అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి నో చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోలెడన్ని లాభాలుంటాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందచేస్తారు. మిగిలిన 70 శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. గ్రాంట్ల రూపంలో కూడా మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే ప్రత్యేక హెదా ఇస్తే, పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయి తీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరో కీలకాంశం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలపై దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ఇందిరా గాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు,పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు. త్యాగాల చరిత్రగల ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడిబజారులో అమ్మకానికి పెట్టింది. అదేమంటే ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయంటూ కారణాలు చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలన్నీ ఒకతాటిపై నిలబడి పోరాటం చేస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసిందంటారు విశ్లేషకు లు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో బద్నాం చేయడానికే చంద్రబాబు ఉపయోగించు కున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టడానికి చంద్రబాబు ప్రయత్నించలేదు. కేంద్రాన్ని విమర్శిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆగ్రహం రావచ్చు అనే సందేహంతో సైలెంట్ అయిపోయారు. ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. మొత్తం మీద ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలు ఈసారి ఎన్నికల్లో కీలకాంశాలుగా మారబోతున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి.


