పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అయితే రెండు కేటగిరీల వారీగా పింఛన్ల పంపిణీ సాగనుంది. గ్రామ ,వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల ద్వారా పింఛన్లను పంపిణీ చేయనున్నారు.
వాలంటీర్లను పింఛన్ పంపిణీకి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించిన తర్వాత ఏపీలో పింఛన్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా నడి చింది. దాంతో పింఛన్లు అందుకునే వృద్ధులు, దివ్యాంగులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యం లో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం గ్రామ, వార్డు సచి వాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరి సంఖ్య తగినంత లేకపోవటంతో రెండు కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ ఆరో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేయను న్నారు. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఈ నాలుగు రోజులు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పనిచేస్తాయి. పింఛన్లను కొంతమందికి ఇంటివద్దే అందజేయనున్నారు. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వితంతువులకు ఇంటివద్ద పింఛన్ అందించనున్నారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తారు.


