26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

తెలంగాణలో బీజేపీ పట్టు సాధించేనా..?

తెలంగాణలో పట్టుకోసం పాకులాడుతోంది బీజేపీ. పార్లమెంట్‌ ఎన్నికల పోరులో రెండంకెల సంఖ్యతో నెగ్గి కమలం హవా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు ధీటుగా పావులు కదుపుతోంది. ఎన్నడూ లేనంతగా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి..పార్టీ ఫిరాయించిన నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించి బరిలోకి దింపింది. సిట్టింగ్‌ సీటుకు సైతం మొండి చేయి చూపింది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు బీజేపీ కండువా కప్పుకున్నా టికెట్‌ ఇచ్చింది. మరి ఈ సరికొత్త వ్యూహం కమలనాథులకు కలిసొస్తుందా..? ఈ పొలిటికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఫలిస్తుందా..?

పార్లమెంట్ ఎన్నికల పోరులో తెలంగాణ కమలనాథులు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తూ వలస వచ్చిన నేతలనే రేసులో దించింది. సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి ఉంటామని.. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకునే బీజేపీ.. వాటన్నింటిని పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన జంప్‌ జిలానీలకే ప్రాధాన్యతనిచ్చింది. అధిక సంఖ్యలో వారికే టికెట్‌ కేటాయిస్తూ బరిలో నిలిపింది. సిద్ధాంతాలు, విధానాల కంటే విక్టరీనే ముఖ్యమని భావించింది.

తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను… 8 స్థానాల్లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నాయకులకే టికెట్‌ ఇచ్చింది. చివరికి సిట్టింగ్‌ ఎంపీకి కూడా మొండి చేయి చూపింది. ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సోయం బాబురావును పక్కన పెట్టి.. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నాగేష్‌కు అవకాశం కల్పించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించే ఒక్క రోజు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్‌కు జహీరాబాద్‌ నుంచి పోటీలో నిలిపింది. అలాగే నాగర్‌కర్నూల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీ రాములు కుమారుడైన భరత్‌కు టికెట్‌ ఇచ్చింది. అదే విధంగా బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సైతం నల్గొండ టికెట్‌ కేటాయించింది. మహబూబాబాద్‌ టికెట్‌ను గులాబీ గూటి నుంచి వచ్చిన సీతారాం నాయక్‌కు ఇచ్చింది. హైదరాబాద్‌ సీటును తనకు కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైకమాండ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. బీజేపీలో కనీసం సభ్యత్వం కూడా లేని మాధవిలతకు అవకాశమిచ్చింది. ఇక ఖమ్మం, వరంగల్‌ సీట్ల పరిస్థితి కూడా ఇంతేనన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డవారిని కాదని.. పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని అక్కడి క్యాడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ వ్యవహారంపై అధిష్టానాన్నే సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా నల్గొండలో తమ శ్రేణులపైనే దాడులు చేసి,.. పోలీసు కేసులు పెట్టించిన సైదిరెడ్డిలాంటి నాయకులతో కలిసి పని చేయలేమని బహరంగంగానే చెబుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే… తమ సొంత బలంతోనే వలస నేతలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క మోదీ చరిస్మాను నమ్మి బీజేపీ గూటికి చేరిన వలస నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మోదీ హవాలో విక్టరీ సులువేనన్న ఆశ ఓవైపైతే… కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్‌ వస్తుందన్న ధీమాలో ఉన్న నేతలు.. భవిష్యత్తులో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఎత్తుగడతోనే పార్టీ ఫిరాయించారు. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా..? జంప్‌ జిలానీలకు స్థానిక నేతలు పూర్తిస్థాయిలో మద్దతునిస్తారా..? కమలనాథుల ఎలక్షన్‌ ఎక్సపర్‌మెంట్‌ సక్సెస్‌ అవుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్