ఎన్నికల వేళ.. పిఠాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అసెంబ్లీ సమన్వయకర్త వంగగీత మధ్య వర్గ పోరు ఇప్పటికీ… కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పార్టీ శ్రేణులను ఏకతాటిపై తెచ్చేందుకు సీఎంజగన్ పనిచేస్తుంటే… పార్టీలోని వర్గ విభేదాలు వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో నియోజక వర్గ నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం జగన్ చెబుతున్నా.. నాయకులు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు.. నియోజక వర్గంలో ఎమ్మెల్యే దొరబాబు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నట్లుగా రాజకీయం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు . ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించటమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసిపి. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టిక్కెట్టు నిరాకరించారు. దీంతో వైసీపీ తీరుపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ పెండం దొరబాబు కు సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో భరోసా ఇచ్చారు.
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఎమ్మెల్యే పెండెం దొరబాబుఇప్పటికీ ఎడముఖం పెడముఖం గానే ఉన్నారు. సమన్వయంలేదు సరికదా.. వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు అందరినీ నియోజకవర్గంలో మోహరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న దొరబాబు కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత, ఎమ్మెల్యే అనుచరగణాన్ని కలుపుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ శేషు కుమారి వైసిపిలో చేరారు. ఈ చేరికకు సంబంధించి కనీస సమాచారం తనకు ఇవ్వటం లేదని దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబును క్యాంపు కార్యాలయానికి పిలిపించి సీఎం మాట్లాడారు. నియోజకవర్గంలో నేతలు విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసి పని చేయాలని సూచించారు.
అదే సమయంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత వ్యవహార శైలి పైన పెండం దొరబాబు సీఎం కు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గీత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని… తన వర్గాన్ని పక్కన పెట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విషయాలను మరచిపోయి.. కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే దొరబాబుకు సూచించారు సీఎం జగన్.నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి తీసుకువస్తే ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ తో పాటు జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పోటీ చేసే అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ కి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ ఇద్దరి మధ్య సయోధ్యకుదుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంత వరకు ఫలిస్తాయి అనేది ప్రశ్నార్దకం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి అధికార పార్టీ లక్ష రూపాయలు ఇచ్చినా తానే గెలిచి తీరుతానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి జనసేన కూటమిలో టిక్కెట్ ఆశించి భంగ పడిన టిడిపి నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరి మద్దతు పొందుతుంటే.. పిఠాపురం వైసీపీలోని విభేదాలు రచ్చ కెక్కడం ఆ పార్టీ గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉందని వైసిపి వర్గాలే చెబుతున్నాయి.