టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, వంద సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని అన్నారు. ఒంగోలు లో అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలందరికీ మంచి జరుగుతుంటే చంద్రబాబులో అసూయ మొద లైందని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే కుల మతాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లాడని, ఎస్సి, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని దళితులను అవమానించాడని మండిప డ్డారు. చంద్రబాబును సపోర్ట్ చేసేవాళ్ళు రాష్ట్రంలో లేరని, వాళ్లంతా రాష్ట్రం బయట ఉన్నవారే అని చెప్పారు. సొంత సతీమణి కూడా చంద్రబాబు గెలుస్తాడని నమ్మటం లేదని ఎద్దేవా చేశారు.
మనం సిద్ధం అంటుంటే, చంద్రబాబు కాకుండా ఆయన సతీమణి సిద్ధం అంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు భార్యే కుప్పం నుండి బై బై బాబు అంటోందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో 10శాతం కూడా అమలు చేయలేదని సీఎం అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేసి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన సీఎం జగన్ పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశాడు.


