పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా, కేటుగాళ్లు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. సరికొత్త మార్గాల్లో గుట్టు చప్పుడు కాకుం డా గంజాయిని తరలిస్తున్నారు. కారు డిక్కీల్లో… కారు టైర్లలో గంజాయిని రవాణా చేసే గ్యాంగులను చూశాం కాని కారు సీఎన్జీ గ్యాస్ సిలిండర్లలో గంజాయి తరలించడాన్ని ఎక్కడైనా చూశా మా…? ఓ నయా గ్యాంగ్… ఈ నయా ప్రయత్నం చేసింది. పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీ సులు, ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా, ఎన్ని నెట్ వర్క్ లను ఛేదిస్తున్నా, గంజాయి రవాణాకు మాత్రం బ్రేక్ పడటం లేదు. రోజుకో ముఠా సరికొత్త మార్గాల్లో గంజాయిని రవాణా చేస్తోంది. తాజాగా మరో గంజాయి రవాణా ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు . సీఎన్జీ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కు బదులు గంజాయి పొట్లాలు పెట్టి రవాణా చేయడానికి ఈ ముఠా ప్రయత్నం చేసింది. పెట్రోల్ కారే అయినా పైకి సీఎస్జీ గ్యాస్ తో నడిచే కారులా కలరింగ్ ఇస్తూ, కారు డిక్కీలో సీఎన్జీ సిలిండర్ ను కేటుగాళ్లు అమర్చారు. పోలీసులు పట్టుకున్నా… సిలిండరే కదా అని వదిలేస్తారని భావించారు . అయితే, సీన్ రివర్స్ అయ్యింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులు, సీఎన్జీ సిలిండర్ లో 40 కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చి పెట్టారు. కారు వెనక సీటు కింద మరో 25 కిలోల గంజాయిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆగ్రా తరలించేందుకు మోసగాళ్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. పట్టుబడ్డ గంజాయి విలువ 19 లక్షల 50 వేల రూపాయలుగా ఉంటుందని మేడ్చల్ డీసీపీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ కి చెందిన అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశిష్ కుశ్వంత్, ఆకాష్ సోలంకి అనే నలుగురు వ్యక్తు లను ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ చౌదరి.. ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడని.. జైలు లో పరిచయమైన వ్యక్తుల ద్వారా.. గంజాయి వ్యాపా రానికి తెరలేపాడని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏపీ లో ఎవరు ఈ గ్యాంగ్ కు డ్రగ్స్ అందిస్తున్నారు, హైదరాబాద్ లో పట్టుబడ్డ ఇతర గ్యాంగులతో లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నామని డీసీపీ నిఖితా పంత్ తెలిపారు.