స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ అంశంపై ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) మరోసారి స్పందించారు. ఈ సారి కేంద్రానికి డెడ్ లైన్(Deadline) విధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించబోవడంలేదని కేంద్రం అధికారిక ప్రకటన చేయాలని, లేకపోతే తాను సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయని కేఏ పాల్ అన్నారు. ఒక్క ఏడాది పాటు స్టీల్ ప్లాంట్ ను అమ్మబోవడంలేదని చెప్పమనండి… స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిందని, ఏపీ ప్రజలు కట్టిన పన్నులు గుజరాత్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే రూ.10 లక్షల కోట్ల అప్పులు తీర్చుతానని, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ తనతో చేయి కలపాలని, పవన్ ను తానే గెలిపిస్తానని కేఏ పాల్ ధీమాగా చెప్పారు.