స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళా హత్య కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో గల ఫ్లైఓవర్ సమీపంలో ముక్కలు చేయబడిన మహిళ శరీర భాగాలు లభ్యం కావడం సంచలంగా మారింది. ఓ మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ దగ్గర్లో పడేశారు దుండగులు. ఇవాళ ఉదయం (జులై 12) 9 గంటలకు పోలీసులకు ఈ సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా.. రెండు బ్లాక్ పాలిథీన్ బ్యాగ్లు కనిపించాయి. ఓ బ్యాగ్లో మహిళ తల ఉంది. మరో సంచిలో కొన్ని శరీర భాగాలున్నాయి. జుట్టు చాలా పొడవుగా ఉండడం వల్ల చనిపోయింది మహిళే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. మహిళా కాదా అన్నది పూర్తి విచారణ తరవాతే తెలుస్తుంది” అని పోలీసులు తెలిపారు. శరీర భాగాలు ఒక్కోటి ఒక్కో చోట పడేసి ఉన్నాయి. ఆమె తలని స్వాధీనం చేసుకున్నారు. మిగతా శరీర భాగాల కోసం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తరహా నేరాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. హత్య చేయడమే కాకుండా బాడీని ముక్కలుగా నరికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా నేరస్థులు ఇలా జాగ్రత్త పడుతున్నారు. ఈ కేస్లను డీల్ చేయడంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
గతేడాది 20 ఏళ్ల శ్రద్ధా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీనా పూనావాలా ఢిల్లీ అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ హత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. కొద్దికాలంగా సహజీవనం సాగిస్తున్న వీరు తరచు గొడవ పడేవారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేసినట్టు చెబుతున్నారు. నేరం బయటకు పొక్కకుండా శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి, 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తాను శ్రద్ధను హత్య చేసినట్టు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ పరీక్షలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా అంగీకరించాడు. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.


