స్వతంత్ర వెబ్ డెస్క్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నేటితో ముగిసాయి. నేడు అమ్మవారు జగన్మాత ఊరేగింపు గజవాహనంపై శోభాయమానంగా జరిగింది. మొదటి రోజు ఆదివారం అమ్మవారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనం సమర్పించడంతో మొదలైన జాతర.. అమ్మవారికి అనేక మంది భక్తులు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రెండో రోజు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. ఇక మూడో రోజు అంబారీపై అమ్మవారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి పురవీధుల మీదుగా నేత్రపర్వంగా ఊరేగించారు. సర్వాలంకర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పర్యవేక్షణలో మహంకాళి అమ్మవారి జాతర అత్యంత కన్నులపండువగా ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వేషధారణలో కళాకారులు నృత్యాలు చేస్తూ.. ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజులు, శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తిప్రపత్తులతో మార్మోగింది.