స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా, అమిత్ షా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు వీరిద్దరు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని ఢిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ బీజేపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.