స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎదుగుతున్న రాష్ట్రానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. దేశ సమస్యలను కాంగ్రెస్, బీజేపీ పరిష్కరించలేకపోయాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా సమస్యలు అలాగే ఉన్నాయని, దేశంలో నేటికీ తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పారు.
‘తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. రక్షణశాఖ భూములున్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. సికింద్రాబాద్లో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరాం. రక్షణశాఖ ఇచ్చే స్థలాలకు సమానమైన భూమిని మరోచోట ఇస్తాం. కేంద్రం సంబంధిత భూములిస్తే.. ప్రజోపయోగ పనులకు వాడతాం. దీనిపై తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.. ఇప్పటికీ ఒప్పుకోలేదు. రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’’ అని కేటీఆర్ చెప్పారు.
దేశంలో ఇప్పటివరకు పని చేసిన ప్రధానుల్లో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీనే అని కేటీఆర్ విమర్శించారు. రూపాయి విలువ పాతాళంలోకి వెళ్లిందని.. అప్పులు ఆకాశానికి చేరాయని మండిపడ్డారు. ‘‘మమ్మల్ని ఎవరికో బీ టీమ్ అంటే ఎలా? ఎవరు ఎవరికి బి టీమ్? ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. ఢిల్లీ నుంచి రాజకీయాలు చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగానే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ‘‘ఢిల్లీ కేంద్రంగా నేషనల్ మీడియా ఉండొచ్చు. అయితే ఢిల్లీ కేంద్రంగా మాత్రమే దేశం నడవదు. హైదరాబాద్ కేంద్రంగా కూడా జాతీయ రాజకీయాలు చేయొచ్చు. నేషనల్ మీడియాకు నేషనల్ క్యాపిటల్ గొప్ప కావొచ్చు. మాకు హైదరాబాదే స్థావరం. అక్కడి నుంచే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం. భవిష్యతులో మీరే చూస్తారు’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.