స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ పరిపాలనా సౌధం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర దశాబ్ది వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తొమ్మిదేళ్లలో తెలంగాణ సంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాన్ని అందించారు. సచివాలయ ప్రారంభం తర్వాత తొలి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 15 వేల మందికి సరిపడేలా సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సచివాలయ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులు వేడుకలకు హాజరయ్యారు.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని.. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని వ్యాఖ్యానించారు. మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింనందుకు సంతోషంగా భావిస్తున్నానని తెలిపారు. మలి దశ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నివాళులుఅర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. తెలంగాణ పదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేటి నుంచి 21 రోజులపాటు దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమే ఉందన్న సీఎం.. అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నామని తెలిపారు. దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణ దృక్పథంతో విధానాల రూపకల్పన జరిగిందని అన్నారు. 2014 జూన్ 2న సీఎంగా తానొక వాగ్దానం చేశానాని.. రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చానని అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాని అన్నారు. కరోనా వల్ల తొమ్మిదేళ్లలో మూడేళ్లు వృధాగా పోయాయని.. మిగిలిన ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించిందని వ్యాఖ్యానించారు. దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని నలుదిశలా చాటుదామని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.