స్వతంత్ర, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రావతరణ పదేళ్ల వసంతోత్సవాలు సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు.
జనగామ పట్టణంలోని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉత్సవాలు మిన్నంటాయి ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్లో దశాబ్ది వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం నిర్వహించారు. ఈ సందర్బంగా అమరవీరుల స్థూపానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు.
అటు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయజెండా ఆవిష్కరించారు. మహబూబాబాద్లో అమరవీరులకు మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణపై తమ అభిమానాన్ని చాటారు. వనపర్తి కలెక్టరేట్లో మంత్రి నిరంజన్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మహబూబునగర్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అమరవీరుల స్థూపానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. జిల్లా కలెక్టరేట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన దశాబ్ది తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బస్సు స్టాండు వద్ద గల మినీ ట్యాంక్ బండ్ దగ్గర 150 అడుగుల జాతీయ పతాకాన్ని మంత్రి ఇంద్ర కరణ్ క్యాంప్ కార్యాలయం నందు, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్ ను, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేసి తమ విధేయతను చాటుకుంటున్నారు.


