25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

బైజూస్ సీఈఓ ఎవరు ?

బైజూస్.. కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారిన ఎడ్‌టెక్ స్టార్టప్. కరోనా మహమ్మారి సమయంలో ఒక ప్రభంజనం సృష్టించిన బైజూస్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. దీంతో అసలు బైజూస్ భవిష్యత్‌ ఏం కానున్నదనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. తాజాగా బైజూస్ బోర్డు అసాధారణ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కంపెనీ సీఈఓగా రవీంద్రన్‌ను తొలగించినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు బోర్డు డైరక్టర్లుగా రవీంద్రన్‌ను, అలాగే రవీంద్రన్ , సంస్థ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌, రవీంద్రన్ సోదరుడు రాజు రవీంద్రన్‌ ను కూడా మెజారిటీ వాటాదారులు తొలగించినట్లు కథనాలు వచ్చాయి.

ఓటింగ్ కోసం ప్రవేశపెట్టిన ఏడు తీర్మానాలకు వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని అసాధారణ జనరల్ బాడీ సమావేశానికి పిలుపునిచ్చిన ఆరు మదుపు సంస్థల్లో ఒకటైన ప్రోసన్ తెలిపింది. పాలనా లోపాలు, ఆర్థిక అవకతవకలు, నిబంధనలు పాటించడంలో వైఫల్యాలను పరిష్కరించడం సహా మరికొన్ని అంశాలు ఈ తీర్మానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం బైజూస్ బోర్డులో సీఈఓ రవీంద్రన్, ఆయన భార్య దివ్యా గోకుల్‌నాథ్‌, సోదరుడు రిజు రవీంద్రన్ మాత్రమే డైరక్టర్లుగా ఉన్నారు.

ఇదిలాఉంటే, ఈ వార్తలను సీఈఓ రవీంద్రన్ తోసిపుచ్చారు. ఆగమేఘాల మీద జరిగిన బైజూస్ అసాధారణ జనరల్ బాడీ సమావేశాన్ని ఒక నాటకంగా అభివర్ణించారు.బైజూస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా తానే కొనసాగుతున్నానన్నారు రవీంద్రన్‌. బైజూస్ యాజమాన్యంలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బైజూస్ సిబ్బందికి రవీంద్రన్ లేఖ రాశారు. కాగా అత్యవసర బోర్డు సమావేశంలో కంపెనీకి సంబంధించి పలు కీలక నిబంధనలను ఉల్లంఘించారని రవీంద్రన్‌ ఆరోపించారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో ఏదైనా ఒక తీర్మానాన్ని ఆమోదించాలంటే కనీసం ఒక వ్యవస్థాపక డైరక్టర్ హాజరు కావాలని నిబంధనలు ఉన్నాయన్నారు.

అయితే ఈజీఎం సమావేశానికి కనీసం ఒక్క వ్యవస్థాపక డైరక్టర్ కూడా హాజరుకాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఈజీఎంలో తీసుకున్న నిబంధనలకు చట్టబద్ధత లేదని రవీంద్రన్ స్పష్టం చేశారు. ఈజీఎంలో తీర్మానాలను ఏకగ్రీవ ఆమోదం లభించిందంటూ కొంతమంది మైనారిటీ వాటాదార్లు చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు రవీంద్రన్. మొత్తం 170 మంది వాటాదారుల్లో కేవలం 35 మంది మాత్రమే తనను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని రవీంద్రన్ వివరణ ఇచ్చారు. ఏమైనా బైజూస్ సంస్థ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయిన స్పష్టం చేశారు రవీంద్రన్.

బైజూస్ ..ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌లలో ఒకటి. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలో పడవేసిన సందర్భంలో జనం అంచనాలకు మించి ఎదిగింది. ఎడ్‌టెక్ స్టార్టప్‌లలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించింది. అయితే స్టార్టప్‌లలో ఇంతగా హల్‌చల్‌ చేసిన బైజూస్ ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బైజూస్‌ స్టార్టప్‌పై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫలితంగా భారీ నష్టాల్లో కూరుకుపోయింది బైజూస్ స్టార్టప్‌.

2015లో బైజూస్‌ లెర్నింగ్ యాప్ ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ వ్యవధిలోనే బైజూస్ ఎదిగింది. 2018 నాటికి 1.5 కోట్ల మంది సబ్‌స్కైబర్లతో ఒక బిలియన్ డాలర్ల కంటే విలువైన సంస్థగా బైజూస్ స్టార్టప్ చరిత్ర సృష్టించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఆన్‌లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపారు. అయితే.. ఆ తరువాతికాలంలో బైజూస్‌ లెర్నింగ్ యాప్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2021లో రూ.2.70 లక్షల కోట్ల నష్టాలను బైజూస్‌ సంస్థ చూసింది. 2020తో పోలిస్తే ఇది 17 రెట్లు ఎక్కువ. అప్పటినుంచి బైజూస్‌ లెర్నింగ్ యాప్‌ వరుస వైఫల్యాలను మూటకట్టుకుంటూనే ఉంది. లాభనష్టాలతో పోలిస్తే, ప్రస్తుతం బైజూస్‌ సంస్థ విలువ రూ.42.124కు పరిమితమైంది. దీనికి ప్రధాన కారణం బైజూస్‌ సంస్థ నుంచి అతి పెద్ద ఇన్వెస్టర్‌, షేర్ హోల్డర్ అయిన ప్రోసన్ ఎన్వీ గ్రూపు తన వాటాను భారీగా తగ్గించుకోవడమే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం కూడా బైజూస్ సంస్థ నష్టాల పాలవడానికి ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లు ఎత్తివేశారు. దీంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడం ప్రారంభమైంది. అప్పటినుంచే బైజూస్ సంస్థ తిరోగమనంలో పడిదంటున్నారు నిపుణులు. అయితే.. కంపెనీకి సంబంధించిన పేపర్లలో మాత్రం లాభాలే కనిపించేవి. వాస్తవంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని బైజూస్ వ్యవహారాలను జాగ్రత్తగా గమనించిన ఇన్వెస్టర్ అనిరద్ద మాల్పనీ పేర్కొన్నారు. కంపెనీ అసలైన విలువ, మార్కెట్‌లో చూపిస్తున్న విలువ మధ్య చాలా తేడా ఉందన్నారు అనిరద్ద మాల్పనీ.

ఇదిలా ఉంటే, మార్కెటింగ్‌పై బైజూస్ సంస్థ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ అలాగే ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీలను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుంది. మరోవైపు ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రధాన స్పాన్సర్లలో ఒకరిగా, 2022 ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ స్పాన్సర్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బైజూస్ సంస్థ పై విమర్శలు పెరిగాయి. పిల్లల తల్లిదండ్రులు వరుసగా విమర్శలు చేయడం మొదలెట్టారు. స్థోమతకు మించి విద్యారంగానికి సంబంధించిన కోర్సులు కొనవలసిందిగా తమ పై ఒత్తిడి చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపించారు. అంతేకాదు బైజూస్ సంస్థ సేవలు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్న ఆరోపణలు వచ్చాయి. మరికొందరు కస్టమర్లు అయితే బైజూస్ సంస్థ తమను దోచుకోవడానికి అనైతిక విధానాలకు పాల్పడుతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్