వచ్చే మన ప్రభుత్వంలో అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పాల్గొన్నారు. నేతలిద్దరూ భోగిమంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. సంక్రాంతిని అమరావతిలో జరుపుకోవడం సంతోషం అని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు.
ఇంకా 87 రోజులే ఉంది, లెక్క బెట్టుకోండి అంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. మన రాజధాని అమరావతే అని చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. జై అమరావతి, జై ఆంధ్రా అన్న నినాదంతో ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామన్నారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే అని పవన్కళ్యాణ్ అన్నారు.