నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జగన్ చేపట్టిన మార్పులు, చేర్పులు పార్టీలో సెగలు పుట్టించాయి. ఫలితంగా మొదటి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బడా నాయకులు పార్టీ విడిచి పోతున్నారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి వంటి కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య రాజీనామా చేయడంతో కార్యకర్తలు అయోమ యంలో పడిపోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి నిలపాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధినేత ధోరణి నచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని వేమిరెడ్డి సూచించారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టిక్కెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంతి రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కోరినా… జగన్ అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. అప్పట్నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు.
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ …వైసీపీ దీటైన అభ్యర్థులను వెతుక్కోవడంతో నిమగ్నమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నా యాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారుచేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వేమారెడ్డి చేసిన పలు సూచనలను కూడా టీడీపీ అధినేత ఆమోదించడం విశేషం.
మాజీమంత్రి, నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా చురుకుగా లేరు. ఆయన కుమరుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్ర మే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటంరెడ్డి వంటి వారం తా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరుతారని తరచూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత ఇప్పటికే ఆరు , ఏడు సార్లు మార్పులు చేర్పులు చేయడంతో చాలా మంది సీనియర్లు ఇతర పార్టీల బాట పట్టారు. మరికొందరి అసంతృప్తితో బాధపడుతున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ.. ఇప్పటికైనా జగన్ తన మార్పుల కార్యక్రమానికి స్వస్తి పలికి దీటైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటి స్తే.. వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి స్వస్తి పలికినట్లవుతుంది.