రిజర్వు బ్యాంక్ నియంత్రణ చర్యలపై ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం స్పందించింది. నిబంధనలను తాము ఏనాడూ ఉల్లంఘించలేదని పేటీఎం పేర్కొంది. ఆర్బీఐ సూచనలకు అనుగుణంగానే పనిచేస్తోందని పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ …ఓసీఎల్ పేర్కొంది. ఒక పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ ఆర్థికరంగానికి సంబం ధించిన నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తోందని పేటీఎం మాతృసంస్థ వెల్లడించింది. అనేక బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఈ ప్రక్రియను తమ సంస్థ విజయవంతంగా పూర్తి చేస్తోందని ఓసీఎల్ స్పష్టం చేసింది. కాగా నిషేధం అమల్లోకి వచ్చిన తరువాత తమ సంస్థ పూర్తి స్థాయిలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ భాగస్వాము లమీద ఆధారపడతామని ఓసీఎల్ వెల్లడించింది. కాగా భవిష్యత్తులోనూ ఓసీఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుందని సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో పనిచేయదని ఓసీఎఎల్ ఒక ప్రకటనలో కుండబద్దలు కొట్టింది.
పేటీఎం వివాదం గురించి తెలుసుకోవాలంటే అసలు పేటీఎం పేమెంట్ బ్యాంక్ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. పేటీఎం పేమెంట్ బ్యాంక్….సాధారణ బ్యాంక్ తో పోలిస్తే భిన్నమైనది. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అంతేకానీ, ఎవరికీ రుణాలు ఇచ్చే అధికారం ఈ బ్యాంక్కు ఉండదు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ డెబిట్ కార్డులను జారీ చేస్తుంది. అయితే క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే ఎవరైనా రుణదాత రెగ్యులేటర్తో కలిసి వ్యవహరించాల్సి ఉంటుంది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఎవరైనా డబ్బులు జమ చేయవచ్చు. మామూలుగా వ్యాపారులకు చేసే చెల్లింపులు చెల్లింపులు ముందుగా వారి పేటీఎం పేమెంట్స్ అకౌంట్లోకి వెళతాయి. ఆ తరువాత సొమ్ములు ..వారివారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతాయి. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ దగ్గర ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ …పీపీఐ లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ను 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంక్ను ప్రారంభించడానికి ఉపయోగించారు.
వాస్తవానికి ఫిబ్రవరి 29వరకు పేటీఎంకు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి. ఆ తరువాత నుంచి పేటీఎం వ్యాలెట్, యూపీఐ సేవలను వాడే వ్యక్తులకు కొన్ని మార్పులు వర్తిస్తాయి. వ్యాలెట్లో సొమ్ములు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. అయితే సదరు వ్యాలెట్లో ఇక సొమ్ములు జమ చేయడం మాత్రం కుదరదు. అయితే ఫాస్టాగ్ ఏమవుతుందన్న ప్రశ్న తాజాగా తెరమీదకు వచ్చింది. ప్రతి కారు విండ్ షీల్డ్ మీద ఫాస్టాగ్ ఉంటుంది. ఇలా ఫాస్టాగ్ ఉండటం ప్రభుత్వ నిబంధన. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. ఈ టోల్ సేకరణ వ్యవస్థను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. సాధారణంగా ప్రతి టోల్ బూత్ దగ్గర ప్రీ పెయిడ్ వాలెట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంటారు. కాగా రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్లో మిగిలిన బ్యాలెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. కానీ, సదరు ఫాస్టాగ్ అకౌంట్లో సొమ్ము డిపాజిట్ చేయడం కుదరదు. ఇదిలా ఉంటే, ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తొలగించింది.
ఫాస్టాగ్కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయ ప్రభావం దాదాపుగా 2.40 కోట్ల మందిపై పడే అవకాశం ఉంది. వీరంతా ఫాస్టాగ్ లను డీ- యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు బ్యాంకును కూడా కొత్తది ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వినియోగదారులకు ఇండియన్ హైవే మేనే జ్మెంట్ కంపెనీ లిమిటెడ్ గుడ్న్యూస్ చెప్పింది. దేశంలోని 32 అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ సేవలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది.ప్రస్తుతం పేటీఎం సంస్థ 2.4 కోట్ల మంది వాహనదారులకు ఫాస్టాగ్ సేవలు అందిస్తోంది. అయితే రిజర్వు బ్యాంక్ ఆంక్షల నేపథ్యంలో అధీకృత బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ 32 అధికృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు కొత్త ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేలా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి వినియోగదారులు వాడే వాహనానికి ఫాస్టాగ్ ను జీవిత కాలం ఉండేలాగా పేటీఎం సంస్థ జారీ చేసింది. పేటీఎం లో నెలకొన్న వివాదం నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఫాస్టాగ్ ను డీ యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికోసం వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్ లో కి లాగిన్ కావలసి ఉంటుంది. ఆ తర్వాత ఐడి, పాస్వర్డ్ సహాయంతో వ్యాలెట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫాస్టాగ్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం హెల్ప్, సపోర్ట్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత కస్టమర్ కేర్ అధికారికి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర సమాచారాన్ని అందచేస్తే …వారు ఫాస్టాగ్ పోర్ట్ చేస్తారు. ఇదిలాఉంటే ఇప్పటివరకు నోడల్ అకౌంట్ కస్టమర్, వ్యాపారుల లావాదేవీలు నిర్వహించే మాస్టర్ ఖాతా లాగా పేటీఎం పని చేసింది. పేటీఎం వివాదం ఎటు టర్న్ తీసుకున్నా… సదరు ఆన్లైన్ చెల్లింపుల బ్యాంక్ ఫాస్టాగ్ సేవలు నిర్వహించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.