అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. నిర్మాణం పూర్తి కాని రామాల యం ప్రారంభోత్సం ఎన్నికల కోసమేనని కాంగ్రెస్ మండిపడుతోంది. అసంపూర్తి ఆలయ ప్రారంభం ధర్మ విరుద్దమని, ఈ విషయాన్ని నలుగురు శంకరాచార్యులు ప్రకటించారని కాంగ్రెస్ తెలియజేస్తోంది. భద్రాద్రి రాముడి కి కేంద్రం ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
నిర్మాణం పూర్తికాని అయోధ్య రామాలయాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించడం వెనుక ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.రాజకీయాల్లోకి రాముడిని లాగడం తగదని, ఇందుకే తాము ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కాంగ్రెస్ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తోందని బిజెపి విమర్శలు మొదలుపెట్టింది. దీంతో బీజేపీ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా మతం కావాలా ప్రజా సమస్యలు కావాలా తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరిగిన లోక్ సభ ఎన్నికల సన్నాక సమావేశంలో, ఇండియా కూటమి సమావేశంలో ఇదే విషయాన్ని కాంగ్రెస్ తెలియజేసింది.
మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, మైనారిటీ, అణగారిన వర్గాలపై దాడులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గడపగడపకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యచరణం సిద్ధం చేసింది. ఆదివారం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు 6000 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ యాత్ర చెపడుతున్నారు. ఈ యాత్ర ద్వారా మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
అయోధ్య రామాలయ విషయంలో కాంగ్రెస్ తొలుత సైలెంట్ గా ఉంది. అయితే, ఈ అంశాన్ని ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలియడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ నేతలు సైతం బీజేపీ రాజకీయాలపై గళం విప్పుతున్నారు. తాజాగా మెదక్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత సినినటి విజయశాంతి మోదీ, అమీషాను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. తాము అయోధ్య రాముడిని ఎంతగా అభిమానిస్తామో భద్రాద్రి రాముడిని సైతం అంతగానే విశ్వసిస్తాం అని విజయశాంతి తెలిపారు. తెలంగాణకు ఎన్నో సార్లు వచ్చిన మోదీ, అమిత్ షాలకు భద్రాచలం సందర్శించే తీరిక లేదా ..? అని ఆమె ప్రశ్నించారు. భద్రాద్రి శ్రీరామునిపై బీజేపీ అగ్రనేతలకు భక్తి లేదా అంటూ నిలదీశారు.
భద్రాద్రి రామాలయ అంశంలో బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయోధ్య పేరుతో రాజకీయం చేస్తున్న అధికార బీజేపీ భద్రాద్రి అభివృద్ధి కోసం నిధులు ఎందుకు కేటాయించ లేనది కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. భద్రాద్రి రామయ్య ఆలయ 800 ఎకరాల భూములను ఏపీకి అప్పచెప్పి, భద్రాద్రి రాముడి ఆలయానికి అన్యాయం చేసారని కాంగ్రెస్ మండిపడుతోంది. భద్రచలాన్ని అనుకుని ఉన్న అయిదుగ్రామ పంచాయితీలను ఏపీకి దారదత్తం చేశారని విమర్శించారు. పోలవరం ముంపులో భద్రచలాన్ని ముంచుతున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని మండి పడ్డారు. అయోధ్య రాముడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటే… భద్రాద్రి రాముడు ప్రచారంతో తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో రాముడిపేరుతో రాజకీయం తప్పదేమో అనిపిస్తోంది.