ఎన్నికల వేళ సమిష్టి నిర్ణయంతో నేతలకు షాక్ ఇచ్చింది ఆ గ్రామం. ఓటు రాజకీయాలు మానండంటూ పొలిటికల్ లీడర్లకు బుద్ధి చెబుతోంది. ప్రజా ప్రతినిధులమని చెప్పుకునే మీకు. మా గోడు, గోస పట్టనప్పుడు ఓటెందుకు వేయాలని నిలదీస్తూ ఎన్నికలను బహిష్కరించించి వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగింది..? ఎలక్షన్ బ్యాన్కి కారణాలేంటి.?
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పార్లమెంట్ ఫైట్ హోరాహోరీగా సాగుతున్న వేళ.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వాలు మారినా తమ దుస్థితి మారడం లేదని ఆగ్రహించిన స్థానికులు లోక్సభ ఎన్నికల ను బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా కనీస మౌళిక సదుపాయాలు లేక,.. అభివృద్ధికి నోచుకోక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలను నమ్మే సాహసం చేయలేమని తాము పడుతున్న బాధలను పాలకులు, అధికారులతో మొరపెట్టుకుని అలిసిపోయాని ఆవేదన చెందుతున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపించి, ఓట్ల కోసం హామీలిచ్చి.. ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడని నేతలకు ఓటు వేసేదే లేదని కఠిన నిర్ణయం తీసుకుంటూ ఎన్నికలను బహిష్కరించారు.
గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని ఉన్న కుగ్రామం రాజారం. అక్కడ 500లకుపైగా గడపలుండి సుమారు వేయి మంది ఓటర్లున్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఇక్కడి ప్రజలు కనీస మౌలిక వసతులు కూడా లేక నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దశాబ్దానికి పైగా తాగడానికి మంచి నీరు లేక,.. సరైన రోడ్లు లేక నరకయాతన పడుతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వాల మాదిరే కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కార్ కూడా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు తప్ప మరెప్పుడు లీడర్లకు ఆ గ్రామంతో పని పడటం లేదని.. అందుకే ఎన్నికలను బహిష్క రించడమే సరైన నిర్ణయంటున్నారు. అప్పుడైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు తమను గుర్తిస్తారని, అందుకే తమ గ్రామ సమస్యలను తీర్చే వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటెయ్య బోమని తేల్చి చెప్పారు.
తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చే వరకు తాము వెనుకడుగు వేయబోమంటున్నారు రాజారం గ్రామస్తులు. ప్రతీసారి ఎన్నికల సమయంతో గ్రామ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నామని అయితే ఎన్నికల్లో ఇచ్చి హామీని ఆ వెంటనే మర్చి తమను మోసం చేస్తున్నారని.. నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయని మండిపడుతు న్నారు. ఇకనైనా పాలకులు,అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను తీర్చాలని వేడుకుంటున్నారు. లేదంటే ఓటుకు దూరంగా ఉంటామని తేల్చి చెబుతు న్నారు. మరి ఇకనైనా రాజారం గ్రామస్తుల పట్ల నేతల తీరు మారుతుందా..? వారు డిమాండ్ చేస్తున్నట్టు సమస్యలను పట్టించుకుంటారా..? లేదంటే మభ్యపెట్టి ఓట్లు దండుకుని వదిలించుకుం టారా అన్నది మున్ముందు వేచి చూడాలి.