తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే (TVK)కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. బుధవారం చెన్నైలోని టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని టీవీకే అధినేత విజయ్ స్వాగతించారు.
అనంతరం విజయ్ చెన్నైలోని లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ఆహ్వానం అందిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
చెన్నై నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. టీవీకే-కాంగ్రెస్ కొత్త పొత్తు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
డీఎంకే-కాంగ్రెస్ బంధానికి ముగింపు?
ఈ తాజా పరిణామాలతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన ఇండియా కూటమి భవిష్యత్తు కూడా అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరాజయం, తమిళనాడులో డీఎంకే ఓటమి, ఇప్పుడు కాంగ్రెస్ కొత్త నిర్ణయం—ఇవి అన్నీ కలిసి జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల మధ్య సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై టీవీకే స్పందించింది.
అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి నివాసానికి విజయ్ వెళ్లినట్లు వచ్చిన వార్తలను పార్టీ ఖండించింది. టీవీకే ఒకేసారి అన్నాడీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో చర్చలు జరుపుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.


