మార్కాపురం జిల్లా: దోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రాత్రి వేళల్లోనే వెలిగొండ టన్నెల్లోకి వెళ్లి లైనింగ్, బెంచింగ్ పనులను స్వయంగా తనిఖీ చేశారు. టన్నెల్స్లో సుమారు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి, 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను సమీక్షించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఈ టీబీఎంను తొలగించేందుకు ప్రయత్నాలు జరగలేదని పేర్కొన్నారు. టీబీఎం తొలగించకపోతే టన్నెల్ నుంచి నీరు బయటకు రాదని స్పష్టం చేశారు. ఇంకా సుమారు 3 వేల కోట్ల రూపాయల పనులు మిగిలి ఉన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ప్రకటించారని విమర్శించారు. పర్యటనలో భాగంగా టన్నెల్-2లోనే అధికారులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అలాగే టన్నెల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఊడి పడుతున్న రాళ్లు, సాఫ్ట్ రాక్ ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు కొనసాగించాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు.


